
- పరిహారం చెల్లించాలని మృతుల కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల లీడర్ల ఆందోళన
భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో భవనం కూలిన ఘటనలో చనిపోయిన తాపీమేస్త్రీ పడిశాల ఉపేందర్రావు డెడ్బాడీని గురువారం అర్ధరాత్రి బయటకు తీశారు. శిథిలాలను పూర్తిగా తొలగించి, ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఉన్నతాధికారులు శుక్రవారం రెస్క్యూను నిలిపివేశారు. ప్రమాదంలో చనిపోయిన చల్లా కామేశ్ తల్లి ఫిర్యాదుతో భవన యజమాని శ్రీపతి, అతడి భార్యపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ధర్నా
భవనం కూలిన ప్రమాదంలో చనిపోయిన కామేశ్, ఉపేందర్రావు డెడ్బాడీలకు స్థానిక ఏరియా హాస్పిటల్లో పోస్ట్మార్టం నిర్వహించారు. కాగా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, కార్మిక, ప్రజాసంఘాల లీడర్లు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. చనిపోయిన వారి ఫ్యామిలీలకు రూ. కోటి చొప్పున పరిహారంతో పాటు, వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యం వహించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన చేస్తున్న వారితో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆర్డీవో దామోదర్ చర్చలు జరిపారు. భవన యజమాని నుంచి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పించడంతో పాటు చనిపోయిన వారి ఫ్యామిలీలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దహన సంస్కారాల ఖర్చులకు రూ. లక్ష చొప్పున అందించారు. పరిహారం అందించే విషయంలో తానే స్వయంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వెంకట్రావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.